Andhra PradeshHome Page Slider

అకాల వర్షాలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలు

రాబోయే రెండురోజులు ఏపీలో భారీవర్షాలు..

మండు వేసవిలో అకాల వర్షాలు, పిడుగులు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. అనుకోకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు విలవిలలాడుతున్నారు. చేతికొచ్చిన పంట నీళ్ల పాలయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఎండి అంచనా ప్రకారం తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ మరియు కర్నాటక మీదుగా ద్రోణి కొనసాగుతోందని విపత్తుల సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో కూడి, అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం కోనసీమ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం,కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.