తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని షెడ్యుల్ ను వెల్లడించారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ.. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఆమె తెలిపారు. అక్టోబర్ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్ఈసీ తెలిపారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణికుముదిని వివరించారు. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని ఎన్నికల ఆమె తెలిపారు. 5 దఫాలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
