Andhra PradeshBreaking NewsHome Page Slider

తె.దే.పా. అధికారంలోకి వస్తే వైకాపా పరిస్థితేంటి!

ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోయి తెదేపా అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలి అని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి జగన్ ఎందుకుకావాలి అనే అంశంపై వైకాకా సమావేశం ఒంగోలులో శుక్రవారం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు, సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు హాజరయ్యారు. మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే వైకాపా నాయకుల తాట తీస్తామంటూ జనసేన, తెదేపా నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని.. తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులు ఆలోచించాలి.
  తనను మంత్రి పదవి నుంచి తొలగించారనే బాధ ఉందని, అయినా అలాంటి అసంతృప్తులు, నాయకుల మధ్యవిభేదాలుంటే పరిష్కరించుకుని సీఎం జగన్ రెడ్డి ఎవరికి టిక్కెట్ట్ ఇచ్చినా కలిసికట్టుగా గెలిపుంచుకుందామని ఉద్బోధించారు. నూటికి 90 శాతం మంది వాలంటీర్లు వైకాపా మద్దతుదారులేనని, ఎన్నికల వేళ వారిని కలుపుకొని వెళ్తే ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాలంటీర్లను కచ్చితంగా మారుస్తామని చెప్పారు. జగన్‌ను జైల్లో పెడితే న్యాయస్థానాన్ని గౌరవిస్తూ వైకాపా వారెవరూ రోడ్డెక్కలేదని, అదే చంద్రబాబును జైల్లో పెడితే న్యాయస్థానాన్ని కూడా తప్పుపట్టేలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయని విమర్శించారు.