InternationalNews

గ్రూపు అడ్మిన్లకు సూపర్ పవర్.. వాట్సాప్ కొత్త ఫీచర్ !

వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్‌లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దీంతో వాట్సాప్‌ గ్రూపులపై అడ్మిన్‌లు మరింత పట్టు సాధించనున్నారు. గతంలో వాట్సాప్‌ గ్రూపులో సభ్యులు ఏదైనా మెసేజ్‌ పోస్ట్‌ లేదా షేర్ చేసినా దాన్ని డిలీట్ చేసే ఆప్షన్‌ కేవలం సదరు యూజర్‌కు మాత్రమే ఉండేది. తాజా అప్‌డేట్‌తో గ్రూపు సభ్యులు పోస్ట్‌ లేదా షేర్‌ చేసే అభ్యంతరకర మెసేజ్‌లను గ్రూపు అడ్మిన్‌లు డిలీట్ చేసేవారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఐఓఎస్‌ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ తెలిపింది.

గ్రూపు సభ్యులు పోస్ట్‌ లేదా షేర్ చేసిన మెసేజ్‌ను అడ్మిన్‌ సెలెక్ట్‌ చేస్తే చాట్ పేజీ పైన డిలీట్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే డిలీట్‌ ఫర్ ఎవ్రీవన్‌, డిలీట్‌ ఫర్‌ మీ, క్యాన్సిల్‌ అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌ సెలెక్ట్ చేస్తే సదరు మెసేజ్‌ గ్రూపు నుంచి డిలీట్ అయిపోతుంది. తర్వాత సదరు మెసేజ్‌ అడ్మిన్‌ డిలీట్‌ చేసినట్లు కనిపిస్తుంది. దీనివల్ల గ్రూపులో అభ్యంతరకరమైన మెసేజ్‌లతోపాటు, నకిలీ వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని వాట్సాప్‌ చెబుతోంది.

ఇవేకాకుండా కొత్తగా ప్రైవసీ ఫీచర్లను వాట్సాప్‌ పరిచయం చేసింది. గ్రూపులో సభ్యులుగా కొనసాగడం ఇష్టంలేనివారు ఇతరులకు తెలియకుండా గ్రూపు నుంచి లెఫ్ట్‌ కావచ్చు. అడ్మిన్‌లకు మాత్రమే గ్రూపు నుంచి వెళ్లినట్లు తెలుస్తుంది. ఆన్‌లైన్‌లో చాట్ చేస్తున్నప్పుడు వేరొకరి నుంచి వచ్చే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం ఇష్టం లేకపోతే, మీరు ఆన్‌లైన్‌ ఉన్నట్లు తెలియకుండా స్టేటస్‌ను హైడ్ చేసుకోవచ్చు. వ్యూవన్‌ ఫీచర్‌ ద్వారా పంపే ఫొటో/ఫైల్‌ను స్క్రీన్‌ తీసుకునే సదుపాయాన్ని కూడా వాట్సాప్ తొలగించింది. డిస్‌అప్పియరింగ్ మెసేజ్‌ టైమ్‌ లిమిట్‌ను కూడా రెండు రోజుల 12 గంటలకు పొడిగించింది.