వారాహి ప్రచార రథానికి నేడు కొండగట్టులో ప్రత్యేక పూజలు
జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి పూజలు జరిపించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి మంగళవారం రానున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం కోసం మంగళవారం ఉదయం సుమారు 9 గంటలకు ఆయన కొండగట్టు క్షేత్రానికి చేరుకుంటారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్ట్లో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. ఈ సమావేశం అనంతరం ధర్మపురి చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచే నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా మరో 31 నారసింహ క్షేత్రాలను దశలవారీగా సందర్శిస్తారు. ధర్మపురిలో దర్శనం అనంతరం సాయంత్రం పవన్ కళ్యాణ్ హైదరాబాదుకు తిరుగు ప్రయాణం కానున్నారు.
