కొందరు ఆరు నెలల్లో సీఎం అవుతానని కలలుగంటున్నారు: రేవంత్ రెడ్డి
సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులు శపనార్ధాలు పెడుతున్నారని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారని… అలాంటి ఆలోచన చేసిన వారిని తెలంగాణ ప్రజలు ఘోరీ కడతారన్నారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం… ఐదేళ్లు సుస్థిరమైన పాలన అందించే బాధ్యత తమదన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న అన్నారు రేవంత్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలు పెట్టిన వ్యక్తి గద్దరన్న అన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ ఉద్యమం మొదలు పెట్టింది గద్దరన్నేనని కితాబిచ్చారు రేవంత్. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు మాకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయనతో మాట్లాడితే మాకు వెయ్యేనుగుల బలం వచ్చేదని… ఆ బలంతోనే గడీల ఇనుప కంచెల బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే భవన్ గా మార్చామన్నారు. ఏ దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మోసం చేశారో… మా ప్రజా ప్రభుత్వంలో ఆ దళితుడికే వచ్చి ఎమ్మెల్సీ కవిత… పూలే విగ్రహం కోసం వినతిపత్రం ఇచ్చారన్నారు. ఎవరైనా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉందన్న రేవంత్ గద్దరన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డును ప్రదానం చేస్తామన్నారు. ఈ వేదికగా చెబుతున్నా.. ఇదే శాసనం.. ఇదే జీవో అని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి గద్దరన్న ప్రతి జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు.


