‘రాజధానిలో పేదలు ఉండకూడదా’?.. జగన్
‘రాష్ట్ర రాజధానిలో పేదలు ఉండకూడదా? అంటూ ప్రశ్నిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్. “ఇది ఇకపై సామాజిక అమరావతి.. మనందరిది” అంటూ వ్యాఖ్యానించారు. సోమవారం కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి.. పట్టాలు అందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అనంతరం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. . “పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే రాజధాని అభివృద్ధి చెందదని కొందరు వాదించారు. పేరుకు ఇది రాజధాని.. అలాంటిది పేదలు ఇక్కడ ఉండకూడదా?. అందుకే.. ఇప్పుడు పేదలకు అండగా మార్పు మొదలైంది. అమరావతిని సామాజిక అమరావతిగా ఇవాళ పునాది రాయి వేస్తున్నా. ఇక నుంచి అమరావతి మన అందరిది”. అంటూ స్పష్టం చేశారు. “ఇవాళ పేదల విజయంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. పేదల వ్యతిరేకులంతా 18 కేసులు వేశారు. ఇందుకోసం ఎక్కడని గడపంటూ లేదు. మూడేళ్ల నుండి మీ కోసం పోరాటం చేశాం. అందుకే.. ఇది పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం సాధించిన విజయం. రాక్షస బుద్ధితో ఉన్నవారితో మనం యుద్ధం చేస్తున్నాం.” అంటూ పేర్కొన్నారు.

పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అవసరమా? అని ప్రశ్నించిన వాళ్లు.. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివిస్తారు. సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేస్తారు. మరి చంద్రబాబు తన హయంలో పేదలకు ఉపయోగపడే పనులు ఎందుకు చేయలేదు?” అని సీఎం జగన్ నిలదీశారు. “పేద పిల్లలు బాగుపడడం వాళ్లకు ఇష్టం లేదు. పెత్తందారుల బుద్ధి ఎలా ఉందో గమనించండి” అంటూ ఏపీ ప్రజలకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ ఇళ్ల గురించి వివరిస్తూ, అక్కచెల్లెమ్మల పేరిటే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 793 ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. నాలుగేళ్లుగా ఎంతో మంచి చేశాం. గత ప్రభుత్వం చేయని మంచి చేశాం. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి అని ఆయన ప్రజలను కోరారు. 45 సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్ద నేడే శంకుస్థాపన చేశారు జగన్. వీటిలో ఒక్కో ప్లాట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైనవని తెలియజేశారు.

