అఫ్రిదీ వ్యాఖ్యలపై శిఖర్ ధావన్ స్ట్రాంగ్ కౌంటర్
పహెల్గాం ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత క్రికెటర్ శిఖర్ ధావన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘మేం మీ దేశాన్ని కార్గిల్ యుద్ధంలో ఓడించాం. అది మర్చిపోయారా? ఇప్పటికే మీరు దారుణంగా పతనమయ్యారు. ఇంకా ఎంత దాకా దిగజారుతారు? ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం మాని.. మీ దేశ పరిస్థితిని మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టండి. భారత సైన్యంపై మేమంతా గర్వపడుతున్నాం” అని ధావన్ ‘ఎక్స్’ వేదికగా అఫ్రిదీపై ఫైర్ అయ్యాడు. పహెల్గాం దాడి జరిగిన తర్వాత అఫ్రిదీ మాట్లాడుతూ.. “ఈ దాడిని వారి సైన్యం ఎందుకు అడ్డుకోలేకపోయింది?” అంటూ అక్కసు వెళ్లగక్కాడు. అఫ్రిదీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో శిఖర్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు వైరల్ గా మారింది.