ఎస్బీఐ త్రైమాసిక లాభం రూ.20 వేల కోట్లు
ముంబయి : ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. రూ.20 వేల పైచిలుకు భారీ లాభాలతో రాణించింది. ఈ త్రైమాసిక ఫలితాలలో రూ.20,160 కోట్లు లాభం సాధించినట్లు ప్రకటించింది. ఏడాదిలో 10 శాతం వృద్ధిని సాధించింది. ఎస్బీఐ మొత్తం ఆదాయం ఈ త్రైమాసికానికి రూ.1,29,141 కోట్ల నుండి రూ.1,34,979 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.1,13,817 కోట్ల నుండి రూ. 1,19,654 కోట్లకు పెరిగింది. ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడి, నిరర్థక ఆస్తులు 2.13 శాతం నుండి 1.73 శాతానికి తగ్గాయి. మొండి బకాయిలు 0.53 నుండి 0.43 కి తగ్గాయి. ఈ ఫలితాల అనంతరం ఎస్బీఐ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో 3శాతం మేర పెరిగి రూ. 780 వద్ద ట్రేడయ్యాయి. మార్కెట్ విశ్లేషకులు ఈ ఫలితాలను “సూపర్ స్ట్రాంగ్ క్వార్టర్”గా అభివర్ణించారు. ఎస్బీఐ ఆస్తి నాణ్యత మెరుగుపడింది, వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఉన్నాయి. దీని వల్ల రాబోయే త్రైమాసికాల్లో కూడా లాభాలు కొనసాగుతాయని అంచనాలు వేస్తున్నారు బిజినెస్ నిపుణులు.
ఈ లాభాలు మొత్తం పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ రంగానికి సానుకూల సంకేతంగా కనిపిస్తోందని, ఇది దేశ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తుంది అని పేర్కొంటున్నారు.

