పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు
పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ అధికారులను హెచ్చరించారు. గురువారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో HMDA నిధులు రూ. కోటి 25 లక్షల తో బాల గార్డెన్ ఫంక్షన్ హాల్ నుంచి గుర్రం చెరువు వరకూ 800 మీటర్ల మేర నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్ వాణి, ఉప కార్యనిర్వహక ఇంజనీర్ వెంకన్న లకు సూచించారు. అనంతరం చాంద్రాయణ గుట్ట జోనల్ పరిధి గుర్రం చెరువు రోడ్డు మార్గంను ముఖ్య కార్యదర్శి పరిశీలించారు. ఇక్కడ ఇష్టారీతిగా పడి ఉన్న ఇరిగేషన్ శాఖ కు చెందిన నీటి పైప్ లు, నిరుపయోగ మరుగుదొడ్లను వెంటనే తొలగించాలని సౌత్ జోన్ కమిషనర్ వెంకన్న, చాంద్రాయణ గుట్ట డిప్యూటి కమిషనర్ సురేందర్ లను అదేశించారు.

రోడ్డు ఇరువైపులా చెత్త చెదారం,వ్యర్థాలు ఉండడంతో ముఖ్య కార్యదర్శి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటూ… సానిటేషన్ హారిబుల్ గా ఉందంటూ GHMC అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదే రోడ్డు గుండా ఎంతో ప్రాముఖ్యత ఉన్న బాలాపూర్ గణేష్ డి నిమజ్జన ఊరేగింపు జరగనుండగా పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై అలక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. రెండు రోజుల్లోగా బాలా పూర్ ఎక్స్ రోడ్డు నుండి drdo వెళ్లే రోడ్డు మార్గం తో పాటు బాలాపూర్ గణేష్ డి నిమజ్జన ఊరేగింపు మార్గంలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత నెలకొనేలా చూడాలన్నారు. ఈ మార్గంలో పెండింగ్ సీసీ, బిటి రోడ్డు నిర్మాణ పనులను మిషన్ మోడ్ లో చేపట్టి పూర్తి చేయాలన్నారు. శాశ్వత వీధి దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జన ఊరేగింపు సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లను సంబంధిత మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించాలని డిసిపి సునీత కు సూచించారు.