పెట్టుబడి పెడుతున్నామంటూ 712 కోట్లకు కుచ్చుటోపీ
పెట్టుబడులు పెడుతున్నామని, వారికి లాభాలు ఉంటాయంటూ ప్రజలను మోసం చేస్తున్న 9 మంది సైబర్ మోసగాళ్లు ఏకంగా 712కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టారు. వీరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఒక ఐటీ ఉద్యోగి 82 లక్షలు మోసపోయానని ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ డబ్బును విదేశాలలోని తీవ్రవాదులు ఉపయోగించే క్రిప్టో కరెన్సీ వెబ్సైట్కు వెళ్లినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ నేరగాళ్లు ముంబై, లక్నో,గుజరాత్, హైదరాబాద్లకు చెందిన వారని, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ డబ్బు క్రిప్టో ద్వారా దుబాయ్ నుండి చైనా వెళ్తోందని తెలిసినట్లు సమాచారం. వీరివద్ద సెల్ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరికి దుబయి, చైనాకు చెందిన నేరగాళ్లతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, జాతీయ స్థాయిలో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు చేయవలసి ఉంటుందని, మరిన్ని కేసులు బయటపడవచ్చని తెలియజేశారు.