Home Page SliderTelangana

“నయా నిజాం పాలనకు విముక్తి రేవంత్ రెడ్డి సారథ్యంలోనే”…పొంగులేటి

ఆనాడు నెహ్రు నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సారధ్యంలో నిజాం పాలనకు విముక్తి జరిగింది.  ఈనాడు రాహుల్ గాంధీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో నయా నిజాం పాలనకు విముక్తి. తెలంగాణా ప్రజలకు ప్రజాపాలన రుచి చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు రెవెన్యూ శాఖ  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వరంగల్ లో జరిగిన ప్రజా పాలన దినోత్సవంలో పాల్గొన్నారు మంత్రి.

నయా నిజాం పాలన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే ఆ పెద్ద మనిషి నయా నిజాం అయ్యాడు. నియంతలు ఎట్లా ఉంటారో ప్రజలకు పదేండ్లు చూపారు. ప్రజాస్వామ్యం పీక పిసికేసారు. తన తెలంగాణ అంటూనే ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, ఉద్యమాలను నిషేధించారు. కాదన్నవాడిని కాలికిందేసి తొక్కేసారు. ధరణి పేరుతో భూముల్నే కాదు, ప్రాజెక్టుల్నీ కూడా పన్నుకు మట్టి అంటకుండా మింగేసారు. అవన్నీ నేను మీకు వివరించాల్సిన పనిలేదు. నాకంటే ఎక్కువగా మీరే అనుభవించారు. మీరంతా నయా నిజాం, నయా రజాకార్ల బాధితులే. ఆనాడు భారత ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉప-ప్రధాని, హోం మంత్రి శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ను పంపి నిజాం పాలన నుంచి విముక్తి కల్పిస్తే, ఇప్పటి నయా నిజంను ఇంటికి పంపడానికి ఈనాడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోని  కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి, ఇతర కాంగ్రెస్ నాయకులకు ఆ పని అప్పగించింది. వీరంతా వీరోచితంగా పోరాడితే .. డిసెంబరు 7, 2023న నయా నిజాం నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి… ప్రజాపాలన అంటే ఏమిటో ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు. అని పొంగులేటి పేర్కొన్నారు.

మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత

తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తున్నది. డచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు… మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచేశాం. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం. ప్రజా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రగతిశీల విధానాలు, ఆర్ధిక క్రమశిక్షణ వల్ల గత తొమ్మిది నెలల కాలంలో చేపట్టిన తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.

మా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలవల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేరకు తగ్గించగలిగాం. అలాగే ముందస్తు తీసుకున్న చర్యల వల్ల 2,454 మందిని రక్షించాం. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలతో పాటు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందించాం. వరద బాధిత కుటుంబాలకు 16,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం

హైడ్రా ఉక్కుపాదం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సంబంధించి కొత్త నగర నిర్మాణమే కాదు ఉన్న నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ను ఏర్పాటు చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించిన పట్టణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించాం. దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు కబ్జాలకు గురికాకుండా హైడ్రా పని చేస్తుంది. సర్కారు ఆస్తుల పరిరక్షణతోపాటు, విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత హైడ్రాకు పెట్టాం. హైడ్రా ప్రారంభించిననాటినుంచి చెరువులను ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపుతుంది. చెరువులు, పార్కులలో అక్రమంగా నిర్మించిన 262 అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఫలితంగా 112 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూ.చ తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం“ అన్నారు.