న్యూ ఇయర్ వేడుకలపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
కొత్త సంవత్సరం పేరుతో గోవాకు, క్లబ్బులు, పబ్బులకు వెళ్లడం మంచిదేనా? ఇదేనా మన సంస్కృతి? అని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. న్యూ ఇయర్ సందర్భంగా వివిధ ఈవెంట్స్ అంటూ చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 1ని బ్రిటిష్ పాలకులు మనపై రుద్ది వెళ్లారని, దీంతో డిసెంబర్ 31 అర్థరాత్రి వరకు ఈవెంట్స్ పేరుతో ఎంజాయ్ చేయడం సనాతన ధర్మం కాదని అన్నారు. మనందరికీ కొత్త సంవత్సరం జనవరి 1 కాదని, ఉగాది అని తెలిపారు. ఉగాది మన హిందువుల కొత్త సంవత్సరమని తెలిపారు. జనవరి 1న కొత్త సంవత్సరం పేరుతో మన భవిష్యత్తు తరాలకు విదేశీ సంస్కృతిని అలవాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉగాది మన కొత్త సంవత్సరం అని మన భవిష్యత్తు తరాలకు చెబుదామని పిలుపునిచ్చారు.