Home Page SliderTelangana

“గణేష్ నిమజ్జనాల సందర్భంగా రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదు”..మంత్రి

జంట నగరాల్లో జరిగే గణేష్ నిమజ్జనం ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గణేష్ నిమజ్జనాల సందర్భంగా రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి ఆనంద్ లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ “శాంతి భద్రతలు కాపాడడంలో కఠినంగా వ్యవహరిస్తాం. సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా చేపట్టే నిమజ్జన వేడుకలు రాజకీయాలకు అతీతంగా ప్రశాంతవాతావరణంలో జరగాలని అ దిశగా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవ వేడుకల సందర్బంగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్య మంత్రి సూచనల మేరకు ఉన్నత అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో అలాగే జంట నగరాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీస్ ఉన్నత అధికారులు జిల్లా స్థాయిలలో సమావేశాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. జంట నగరాల్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ నెల 16న నిర్వహించే మీలాదున్ నబి పండుగను ముస్లిం మత పెద్దలు 19 న పండుగ చేసుకునేలా అంగీకరించినట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ ఐక్యత కు ప్రతీకగా నిలుస్తుందని, ఎక్కడైనా పండుగ నేపథ్యంలో అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహారిస్తామని స్పష్టం చేసారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కు పాదంతో అణిచివేస్తామని అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ నిమజ్జనం సందర్బంగా శాంతి భద్రతల నిర్వహణలో పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని నిమజ్జన వేడుకల్లో 15 వేల మంది, ఇతర జిల్లాల నుండి 3 వేల మంది కేటాయించి పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు ఇంకను 8 వేలమంది పోలీసులను విధులకు తీసుకోవడం జరుగుతుందన్నారు.