యూట్యూబ్ లో చూసి ఆపరేషన్.. బాలుడి మృతి
పద్నాలుగేళ్ళ బాలుడిపై నకిలీ డాక్టర్ యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ చేశాడు. బాలుడి ఆరోగ్యం విషమించడంతో అంబులెన్స్ లో వేరే ఆసుపత్రికి తరలించే లోపే బాలుడు చనిపోయాడు. బాలుడు చనిపోవడంతో ఆ నకిలీ డాక్టర్ పారిపోయాడు. దీంతో తల్లిదండ్రులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఈ ఘటన బీహార్ లోని సారణ్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన 14 ఏళ్ల బాలుడు క్రిష్ణకుమార్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పదే పదే వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆ బాలుడిని గణపతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చేర్పించిన కాసేపటికే బాలుడికి వాంతులు తగ్గిపోయాయి.
అయితే.. అజిత్ కుమార్ పురి అనే వైద్యుడు ఆపరేషన్ చేయాలని చెప్పాడు. వాంతులు తగ్గిపోయాయి కదా అని అడిగినందుకు తమపై కేకలు వేశాడని.. డాక్టర్ నేనా, మీరా అని కోపోద్రిక్తుడయ్యాడని తల్లిదండ్రులు మీడియా ముందు వాపోయారు. ఆపరేషన్ తర్వాత బాలుడి పరిస్థితి విషమంగా మారడంతో అంబులెన్స్ లో పాట్నాలోని పెద్దాసుపత్రికి తరలించే లోపే బాలుడు చనిపోయాడు. బాలుడు చనిపోయిన వెంటనే ఆ నకిలీ డాక్టర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడి తల్లిదండ్రులు, వారి బంధువులతో కలిసి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకూ మృతదేహానికి అంత్యక్రియలు చేయబోమని తేల్చి చెప్పారు. అయితే.. బాధితుల ఫిర్యాదు మేరకు నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

