” ఎట్లున్నవ్ బిడ్డా..పానం మంచిగుందా?”..కేసీఆర్ గొంతు వినగానే…
ఢిల్లీ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, ఆమె తండ్రి కేసీఆర్ ఫోన్లో పలకరించారు. జైలు నుండి బయటకు రాగానే ఆమె స్వయంగా తండ్రికి ఫోన్ చేసి మాట్లాడారు. “ఎట్లున్నవ్ బిడ్డా..పానం మంచిగుందా?” అంటూ కేసీఆర్ గొంతు వినగానే ఆమె భావోద్వేగానికి గురయినట్లు తెలిసింది. కన్నీటి పర్యంతమయ్యింది. నేడు కేటీఆర్, హరీశ్ రావులతో సహా ఆమె హైదరాబాద్ చేరుకోనుంది. మార్చి 15 న ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేసి, ఢిల్లీ తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచిన సంగతి తెలిసిందే. 5 నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. గతంలో ఎన్నోసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా లభించలేదు. మంగళవారం ఆమెకు బెయిల్ లభించగానే బీఆర్ఎస్ శ్రేణులు చాలా సంబరాలు చేసుకున్నాయి. విడుదలైన వెంటనే ఢిల్లీలోని వసంత విహార్లో బీఆర్ఎస్ కార్యాలయానికి చేరి, అక్కడ కుటుంబసభ్యులకు, నేతలకు స్వీట్లు పంచారు. నేడు ఢిల్లీలో మీడియాతో ఆమె మాట్లాడనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.

