Breaking NewsHome Page SliderTelangana

ఇప్పుడు గురువుల్లా….అప్పుడు గురివింద‌ల్లా

ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు.. వారుకూడా ఒకవిధంగా ప్రభుత్వ ఉద్యోగులే.. ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రతి నెలా జీత భత్యాలు తీసుకునే వారు ఎన్నుకున్న ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే ఎలా? అనే ప్రశ్న అసెంబ్లీలో లేవనెత్తారు సీఎం చంద్రబాబు, స్పీక‌ర్ అయ్యన్న పాత్రుడు. వైసీపీ సభ్యులు కొంత మంది శాసన సభకు హాజరైనట్లుగా రిజిస్టర్‌లో సంతకాలు చేశారని వారెవరూ తనకు సభలో కనిపించలేదన్నారు చంద్రబాబు. గవర్నర్ ప్రసంగం తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రు కాకుండా, కేవ‌లం రిజిస్టర్‌లో సంత‌కాలు చేయ‌డంపై స్పీక‌ర్ అయ్యన్నపాత్రుడు సీరియ‌స్ అయ్యారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేయడం ఎందుకని.. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ధైర్యంగా సభకు రాలేరా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే పాయింట్ లేవనెత్తారు. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ 57లక్షల జీతం తీసుకున్నారని..ప్రజల సొమ్ము జీతంగా పొందుతున్న కేసీఆర్ అసెంబ్లీకి సమావేశాలకు వచ్చి తెలంగాణ అభివృద్ధికి సలహాలు ఇవ్వకుండా హౌస్‌లో ఉండిపోవడం సమంజసమా అని రేవంత్ ప్రశ్నించారు. అయితే చంద్ర‌బాబు,రేవంత్ రెడ్డి ఇద్ద‌రూ …ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎన్నాళ్లు అసెంబ్లీకి హాజ‌ర‌య్యారో…ఎందుకు అసెంబ్లీ స‌మావేశాల‌కు డుమ్మా కోట్టారో గుర్తు తెచ్చుకోవాల‌ని అటు వైసీపి,ఇటు బీ.ఆర్‌.ఎస్ శ్రేణులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌లు సంధిస్తున్నాయి.