“కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం”.. రేవంత్ రెడ్డి
పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన పోలీసుల డ్యూటీలో నిబద్దత గురించి మాట్లాడుతూ “రాబోయే రెండేళ్లలో హైదరాబాద్లో పోలీస్ స్కూల్ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కాస్మెటిక్ పోలీసింగ్ కాదు కాంక్రీట్ పోలీసింగ్ అవసరం అని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే నేరస్తులకు కాదని స్పష్టం చేశారు. వ్యసనాలకు బానిసలైన కొంతమంది… డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలి. మీ అందరిని చూస్తోంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న నమ్మకం కలుగుతోంది. ఇది ఉద్యోగ బాధ్యత కాదు.. ఇది భావోద్వేగం. తెలంగాణను పునర్నిర్మించి, భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఏ సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులే” అని పేర్కొన్నారు.

“యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చినా గత తొమ్మిదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం. హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి. వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. అందుకే చేరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం. అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపేందుకూ వెనకాడం. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్చందంగా వదలాలని ఆక్రమనదారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా..లేకపోతే చెరువులలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతాం. నాలాల ఆక్రమణలను నిరభ్యంతరంగా కూల్చేస్తాం..ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తాం.. మూసీ నాలాల్లో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తాం”.అని హామీ ఇచ్చారు.

