“వరద సమయంలో బురద రాజకీయాలు చేస్తున్నారు”…రేవంత్ రెడ్డి
సూర్యాపేట జిల్లా వరదలపై సమీక్ష సమావేశం జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా లో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం. ఆయన మాట్లాడుతూ “వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు. బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తారు కానీ వరద బాధితులను పరామర్శించరు. అమెరికాలో ఉండి ఒకాయన ట్విట్టర్ లో పెడుతున్నాడు. ఒకాయన ఫాంహౌస్ లో ఉన్నాడు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలి. రాజకీయాలకు ఇది సమయం కాదు.” అంటూ హితవు చెప్పారు.
” తెలంగాణలో భారీ వర్షాల కారణంగా రూ.5వేల కోట్ల నష్టం వచ్చింది. మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా నేను సమీక్ష చేస్తున్నా. వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్డిఆర్ఎఫ్ ను ప్రారంభించుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా లో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడింది. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పంట, ఆస్తి నష్టం పైన అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం నిరంతరం మంత్రులు,ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం. ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఖమ్మం,నల్లగొండ పరిస్థితి పైన ప్రధాని మోదీ, అమిత్ షా,రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరాను.
వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం. పశువులు చనిపోతే 50 వేల సాయం. పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి పదివేల సాయం. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు. సూర్యాపేట కలెక్టర్ కు తక్షణ సాయంగా ఐదు కోట్లు. పాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్ల కు నిర్ణయాధికారం. వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు.” అని పేర్కొన్నారు.

