ఘనంగా జాతీయ క్రీడా పురస్కరాల ప్రదానోత్సవం
జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పలువురు క్రీడాకారులు పురస్కారాలు అందుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ అందుకున్నారు. 25 మంది క్రీడాకారులు అర్జున అవార్డు అందుకున్నారు. మరో 8 మంది కోచ్లకు ద్రోణాచార్య అవార్డులను అందజేశారు. అర్జున అవార్డు అందుకున్నవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ స్టార్ హెచ్. ప్రణయ్, ఆకుల శ్రీజ ఉన్నారు. 2022కు సంబంధించిన ఈ క్రీడా అవార్డులను నవంబర్ 14న భారత క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది క్రికెట్ నుంచి దినేష్ లాడ్ ఒక్కరే క్రీడా పురస్కారం అందుకున్నారు.