NewsTelangana

మా అమ్మను బెదిరించారు

టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిపై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ స్పందించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత ఆదేశాలతో హైదరాబాద్‌లోని తన ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారని అర్వింద్‌ ఆరోపించారు. ఇంట్లో వస్తువులను పగలగొడుతూ భీభత్సం సృష్టించారన్నారు. ఇంట్లో ఉన్న తన అమ్మను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. పీఎంఓ, ప్రధాని మోదీలను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పార్టీ మారబోతున్నారంటూ అర్వింద్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. అర్వింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటికి టీఆర్‌ఎస్‌ జెండాను కూడా కట్టారు. 100 మందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడికి పోలీసుకు చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దాడి జరిగిన సమయంలో అర్వింద్‌ నిజామాబాద్‌లో ఉన్నారు.