మునావర్ కామెడీ షోకు అనుమతి… ఎమ్మెల్యే రాజాసింగ్ గృహ నిర్బంధం
హైదరాబాద్లో మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ షో ప్రస్తుతం కాక రేపుతోంది. రేపు శిల్పకళా వేదికలో ఈ షో నిర్వహించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుక్ మై షో ద్వారా టికెట్ల విక్రయాలు కూడా కొనసాగుతున్నాయి. ఇదిలా వుంటే మునావర్ ఫారుఖీ షోని అడ్డుకుంటామని బీజేవైఎం నేతలు ఇప్పటికే హెచ్చరించారు. మునావర్ షోకి అనుమతి ఇవ్వొద్దని కోరుతూ తెలంగాణ డీజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చారు . ఓ వర్గం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మునావర్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మునావర్ షోను ఇప్పటికే బ్యాన్ చేసింది. మునవర్ షోకు అనుమతి ఇస్తే అడ్డుకుంటామని రేపు శిల్పకలా వేదికలో ఏమైనా జరగొచ్చని ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు. రాజాసింగ్ హెచ్చరికతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా మోహరించి ముందస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను బయటకు రావొద్దని చెప్పినా వినకపోవడంతో ఆయన్ను గృహ నిర్బంధం చేసినట్లు గోషామహల్ పోలీసులు వెల్లడించారు. కాగా మునావర్ ఫారుఖీ కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపు హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో మునావర్ షోకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ పోలీసులు ఇంత వరకు మునావర్ షోకు అనుమతినివ్వలేదు. అనుమతిపై పోలీసులు నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మునావర్ ఫరూఖీ ఎవరు..?
మునావర్ గుజరాత్ భారత ముస్లిం కుటుంబానికి చెందిన ఓ స్టాండప్ కమేడియన్.. దావూద్, యమరాజ్ అండ్ ఔరత్ అనే కామెడీ వీడియోతో తన మొదటి ప్రదర్శన చేశాడు . కంగనా రనౌత్ రియాలిటీ షో లాక్ అప్ టైటిల్ విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించాడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో స్టాండప్ కామెడీ షో మొదలు పెట్టినప్పటి నుంచి బీజేపీ శ్రేణులు వ్యతిరేకిస్తూ వచ్చారు. హిందూ దేవతల్ని హేళన చేస్తూ కామెడీ చేయడమే ఇతని స్పెషాలిటీ. హిందూ దేవతలతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద కూడా జోకులు పేల్చుతుండటంతో బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలావుంటే.. గత ఏడాది హైదరాబాద్లో కామెడీ షో చేసి వెళ్లి.. మధ్యప్రదేశ్లో మరో షో చేస్తుండగా హేట్ స్పీచ్ నేరంపై పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ లో షో చేస్తున్నాడని తెలిసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.