మీడియాకు మోహన్బాబు క్షమాపణలు..
ఎట్టకేలకు సినీనటుడు మోహన్బాబు మీడియాపై దాడి ఘటనలో క్షమాపణలు చెప్పారు. శంషాబాద్ వద్ద మోహన్బాబు ఇంటివద్ద గొడవ విషయంలో ప్రశ్నిస్తున్న టీవీ రిపోర్టర్ మైక్ లాక్కుని, అతడిని గాయపరిచిన ఘటనలో గత రెండు రోజులుగా మీడియా వాళ్లు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రిపోర్టర్ దవడ ఎముక విరిగిందని సమాచారం. ఈ ఘటనపై స్పందిస్తూ మోహన్ బాబు లిఖితపూర్వకంగా లేఖ విడుదల చేశారు. నా కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారి టీవీ జర్నలిస్టులను ఆవేదనకు గురి చేసినందుకు చింతిస్తున్నాను. ఘటన అనంతరం రెండు రోజుల పాటు ఆస్పత్రి పాలు కావడంతో వెంటనే స్పందించలేకపోయాను. ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడడం విచారకరం. వారికి, మీడియాకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు.