Breaking NewsHome Page Sliderhome page sliderNationalNewsPolitics

మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం

నల్లగొండ‌: మంత్రి పదవి దక్కకపోవడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీపై ఆగ్రహంతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

కాంగ్రెస్‌ పునరుజ్జీవనానికి తాను అహర్నిశలు కష్టపడ్డానని, పార్టీ నిలబెట్టేందుకు తన సొంత ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని రాజగోపాల్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, త్యాగాలు చేసిన తనను పక్కన పెట్టి పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని, తాను, అలాగే బీజేపీ నుంచి వచ్చిన వివేక్ వెంకటస్వామి వంటి నాయకులు మాత్రం నిర్లక్ష్యం ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. అంతేకాక, వివేక్ కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వడంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.

మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి, చివరికి మోసం చేశారు. కొందరు నేతలు కావాలనే అడ్డుపడుతున్నారు” అని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన కృషి, నిబద్ధతకు గుర్తింపు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించడం తాను అంగీకరించలేనని ఆయన పేర్కొన్నారు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.