ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి బహిరంగ లేఖ
ఎన్నిసార్లు తలనరుక్కుంటారు?
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో.. దళిత వర్గాలను మభ్యపెట్టేందుకు మీరు ప్రయోగించిన అస్త్రం ‘దళితుడినే ముఖ్యమంత్రిని చేయడం’. రాష్ట్ర సాధన తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభలోనూ ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి’ అని ప్రకటించారు. ఆ తర్వాత వివిధ వేదికల ద్వారా ఈమాటను పదే పదే చెప్పారు.
‘కేసీఆర్ మాట చెబితే.. తల నరుక్కుంటాడు కానీ మాట తప్పను!’ అని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన మీరు.. అధికారంలోకి రాగానే ఎందుకు మీ వాగ్దానాన్ని తుంగలో తొక్కారు? ఉత్తమాటలు చెప్పుకుని ప్రజలను మాయచేసే మీరు.. రాష్ట్రంలోని 20 శాతానికి పైగా ఉన్న దళిత, అణగారిన వర్గాలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలనే కుట్ర మీరు ఎలాచేయగలిగారు?
ఇటువంటి మోసపూరిత ప్రతిజ్ఞలు చేసి.. ఇతర పార్టీలను తిప్పలు పెట్టానని మీకు మీరే సంబరపడ్డారు. దీన్ని గొప్ప రాజకీయ చతురతగా మీ వాళ్లతో ప్రచారం చేయించుకున్నారు. తెలంగాణ దండోరా ఉద్యమాన్ని బలహీనం చేస్తూ.. దళితుల్లో లేనిపోని ఆశలు కల్పించిన మీ తీరు.. ‘ఏరు దాటాక తెప్ప తగలేసే’ రకమని తెలుసుకునేందుకు.. చాలా సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజానీకం వాస్తవాలను గ్రహిస్తోంది. నాడు మీరు చెప్పిన మాటల్లోని కుటిల అర్థాన్ని అర్థం చేసుకుంటోంది. దీన్ని మీరు మీ కుటుంబం జీర్ణించుకోవడం లేదు. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణకు తొలి బీసీని అందిస్తామని చెబితే.. మీ సుపుత్రుడు ‘కులం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం’ అని ప్రకటించారు. ఇది చాలదా మీ కుటుంబానికి బీసీల పట్ల.. అగౌరవానికి నిదర్శనం.
అలాగే.. ‘నాకు ఏ పదవులూ వద్దు, నేను తెలంగాణకు కాపలా కుక్క’లా ఉంటానని పదే పదే వల్లెవేసిన మీరు.. అధికారంలోకి రాగానే ‘మాది ఫక్తు రాజకీయ పార్టీ’ అని చెప్పి.. ‘కేసీఆర్ మాట, నీటి మూట’ అని నిరూపించారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న మీరే.. వడ్డించిన విస్తరిలా, మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని మీ కుటుంబానికి వడ్డించారు. ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న మీ కుమారుడిని, కూతురిని తెలంగాణ ప్రజలపై రుద్దారు. ‘మియా‑బీబీ’ పదాన్ని ‘మియాపూర్ భూముల’ వరకు విస్తరించారు. మీ బిడ్డ కవితమ్మే బతుకమ్మ అన్నట్లు ప్రజల నెత్తులమీద బలవంతంగా పెట్టారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆ బరువును దించకపోతే ఆమె తెలంగాణ ‘రెండో పవర్సెంటర్’ అయ్యేవారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు, సంతోష్ కుమార్, వినోద్ కుమార్ అంటూ వేలు విరిచిన చుట్టాలంతా రాష్ట్రంపై పడ్డారు. అల్లుడు హరీశ్ రావు విషయంలోనైతే మీరు మింగలేక, కక్కలేక నెట్టుకొస్తున్నారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో మీ ‘గుర్రం’ ఎగిరితే కనుక వారసత్వ పదవులతో తృప్తిపడే రాహుల్ గాంధీ వంటి వారి పక్కన కూర్చుని.. కేంద్ర ప్రభుత్వంలో పదవిని అలంకరిద్దామని అనుకున్నమాట వాస్తవం కాదా? మీ పుత్రరత్నంను తెలంగాణ ముఖ్యమంత్రిని చేయాలని ఆశపడ్డారు. మీ అత్యాశను గమనిస్తే.. మీకు స్వచ్ఛమైన మనసుతో ‘బంగారు తెలంగాణ’ను నిర్మించే ఉద్దేశం లేదని.. మీ కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకోవాలని తాపత్రయపడుతున్నారనేది సుస్పష్టం.
దేశ ప్రజల అదృష్టం కొద్దీ అప్పటి మీ అంచనాలు తప్పడంతో ఇప్పుడు మీ కుమారుడిని రాజకీయ కేంద్రంగా మార్చి రాష్ట్ర ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారు. ఇలా మీరు మాట తప్పితే తల నరుక్కుంటాననే మాటపై నిలబడి ఉండే.. ఇప్పటికి ఎన్నిసార్లు తల నరుక్కోవాల్సి వచ్చేదో! పది మంది దశకంఠులలా.. వంద తలలున్నా సరిపోయేది కాదేమో.
ఇన్నిరకాలుగా రాష్ట్రాన్ని మోసం చేసిన మీకు, మీ పార్టీకి రానున్న ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతారు.
భవదీయ
కిషన్ రెడ్డి

