నా హత్యకు ఖలిస్థానీయుల కుట్ర: కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు
రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సంచలన ఆరోపణలు చేశారు. రాడికల్ ప్రచారకుడు, ఎంపీ అమృత్పాల్ సింగ్ నడిపిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తనతో పాటు పంజాబ్లో మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రాణాలకు కూడా ఖలిస్థానీయుల నుంచి ముప్పు పొంచి ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో లీకైన కొన్ని స్క్రీన్ షాట్ల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్పాల్ నిర్బంధం మరో ఏడాది పొడిగించడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా వారిస్ పంజాబ్ దే నాయకులు కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. ఈవిషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు.