తెలంగాణా కేబినెట్లో కీలక ఆమోదాలు
బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ఆమోదం లభించింది. అలాగే, విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసులను మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనిపై శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాలని శుక్రవారం తీర్మానం చేశారు. తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024 వివరాలు నమోదు చేసుకోవడానికి రెండోసారి ఇచ్చిన గడువు పూర్తయిన నేపథ్యంలో ఆ వివరాలను మంత్రిమండలి సమగ్రంగా చర్చించింది. మహిళా సాధికారతకు పట్టం కడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025 కు కేబినెట్ ఆమోదం లభించింది.వీటితో పాటు మరో 24 కీలక అంశాలకు సంబంధించి కేబినెట్ తీర్మానాలు చేశారు.