కేసీఆర్ మోసగాళ్లకు మోసగాడు..
శుక్రవారం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ లో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఉఫ్ అని ఊదితే ఆ గాలికే కేసీఆర్ కొట్టుకుపోతారని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీజనల్ ప్రతిపక్ష నేతగా మారారని విమర్శించారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని, ఫాంహౌస్ లో కూర్చుని జనాలను ఇంకా ఎలా మోసం చేయాలా అని ఆలోచిస్తున్నాడని ఆరోపించారు. ఆయనను మోసగాళ్లకు మోసగాడని పిలవొచ్చన్నారు. ఆయనవి భక్వాస్ మాటలని కొట్టిపారేశారు. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్.. సచివాలయంలో కనీసం మూడు రివ్యూలైనా చేయలేదన్నారు. సీఎంగా ఉంటేనే అసెంబ్లీకు వస్తారా.. ప్రతిపక్ష నేతగా ఉంటే అసెంబ్లీకి రారా అని జగ్గారెడ్డి నిలదీశారు.