NationalNews

తమిళనాడులో జయలలిత ఆడియో కలకలం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంబంధించిన నివేదికను ఆర్ముగన్‌స్వామి కమిషన్ తాజాగా విడుదల చేసింది. ఈ నివేదికలో జయలలిత మృతి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఈ నివేదిక దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.  జయలలిత నెచ్చెలి శశికళ జయలలిత మృతికి పరోక్షంగా కారణమని ఆర్ముగన్‌స్వామి నివేదికలో వెల్లడించింది. కాగా ఈ కేసులో ఆమెను విచారించాలని ప్రభుత్వానికి విన్నవించింది. దీనికి తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్యలు చేపడుతుంది. ఇటువంటి పరిస్థితులలో విడుదలైన జయలలిత ఆడియో ఆర్ముగన్ నివేదికలో వెల్లడించిన విషయాలకు బలం చేకూరుస్తున్నట్లు కన్పిస్తోంది.

అయితే చెన్నై అపోలో హస్పటల్‌లో జయలలిత ఆడియో విడుదలయ్యింది. కాగా ఈ ఆడియో తమిళనాడులో తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ఈ ఆడియోలో ఉన్న వాయిస్ జయలలితదే అని ఆమె అభిమానులు తేల్చి చెప్తున్నారు. ఈ ఆడియోలో జయలలిత హస్పటల్‌లో డాక్టర్లపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఈ ఆడియోలో తాను పిలిచినప్పుడు ఎందుకు రావడం లేదని డాక్టర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాను బాధపడుతుంటే పట్టించుకోవడం లేదని డాక్టర్లను జయలలిత మందలించారు. జయలలిత ఆడియో హస్పటల్ స్టాఫ్ రికార్డ్ చేశారు. ఆర్ముగన్‌స్వామి రిపోర్ట్‌తో జయలలిత మృతికి సంబంధించిన ఆడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ  ఆడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.