చిన్నారి వైద్యానికి కోటి మంజూరు చేసిన జగన్
◆ఖరీదైన ఇంజక్షన్ల పంపిణీ ప్రారంభం
◆అరుదైన “గాకర్స్’’ వ్యాధి బారినపడ్డ చిన్నారి
◆దయనీయ స్థితిపై చలించిన ముఖ్యమంత్రి
◆కోనసీమలో సీఎం సాక్షిగా ప్లకార్డులు ప్రదర్శించిన తల్లిదండ్రులు
◆ప్లకార్డును చూసి కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడిన సీఎం
◆వైద్యంతోపాటు చిన్నారి భవిష్యత్ బాధ్యతకు జగన్ హామీ
అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఏకంగా టి రూపాయల బడ్జెట్ను కేటాయించారు. దీంట్లో భాగంగా అత్యంత ఖరీదైన 10 ఇంజక్షన్లను బి.ఆర్.అంబేద్కర్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చిన్నారిని చదివించే బాధ్యతనుకూడా ప్రభుత్వం తీసుకుంటోందని వెల్లడించారు. నెలకు రూ.10వేల రూపాయాల పెన్షన్కూడా మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామే రానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతులకు చెందిన రెండున్నర సంవత్సరాల చిన్నారి బాలిక హనీకి పుట్టుకతోనే గాకర్స్ వ్యాధి బారినపడింది. ఈ వ్యాధి వల్ల కాలేయం పనిచేయదు. ఇటీవల గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా కోనసీమ జిల్లా గంటి పెద్దపూడిలో సీఎం పర్యటించారు. తిరుగు ప్రయాణంలో సీఎం ఉండగా, హనీ తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలంటూ ప్రదర్శించిన ప్లకార్డును సీఎం చూశారు. వెంటనే కాన్వాయ్ను ఆపి వారితో మాట్లాడారు . తన వెంట హెలిపాడ్ వద్దకు తీసుకురావాలని అక్కడున్న భద్రతా సిబ్బందిని ఆదేశించారు. హెలిపాడ్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం క్షుణ్నంగా మాట్లాడి హనీకి సోకిన వ్యాధి, చేయాల్సిన వైద్యం గురించి ఆరా తీశారు. చిన్నారి ప్రాణాలు నిలిపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, ఖర్చు ఎంతైనా పర్వాలేదని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆదేశించారు. కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, వాటిని మంజూరు చేసింది. హనీ వైద్యం కోసం కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చిందని కలెక్టర్ వెల్లడించారు.

ఆదివారం అమలాపురంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నందు చిన్నారి హనీకి ఇంజక్షన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ గాకర్స్ వ్యాధి నివారణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజక్షన్లు మంజూరు చేసిందని, ప్రస్తుతం 13 ఇంజక్షన్లను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి పంపడం జరిగిందన్నారు. ఈ ఇంజక్షన్ ఖరీదు రూ 1,25,000 కాగా, కంపెనీతో తెప్పించారు. ప్రతి 15 రోజులకు ఒక ఇంజక్షన్ను, క్రమం తప్పకుండా చిన్నారికి ఇవ్వనున్నారు. అలాగే పాప భవిష్యత్తు విద్య పరంగా కూడా ముఖ్యమంత్రి స్పందించి సహకారం అందించారని కలెక్టర్ తెలిపారు. పింఛన్ ఇప్పించేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. దేశంలో ఈ వ్యాధి చాలా అరుదుగా సంక్రమిస్తుందని దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు 14 మంది ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి వైద్యం అందించటంలేదని తొలుతగా స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు ఈ తరహా వ్యాధి నివారణ చర్యలు ఆరంభమయ్యాయన్నారు.

పాప తండ్రి కొప్పాడ రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలవగానే ఎంతో మానవతా దృక్పథంతో స్పందించి ఎంత ఖర్చయినా పర్వాలేదు నేను ప్రభుత్వపరంగా ఆదుకుంటానని భరోసా కల్పించారన్నారు. భరోసా ఇచ్చిన రెండు నెలల్లో వైద్య సేవలు ఆరంభం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్నారి తల్లి నాగలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి వ్యాధి ఏ ఒక్కరికి రాకూడదని అన్నారు. తమది పేద కుటుంబమని వైద్యం చేయించగల ఆర్థిక స్తోమత తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని అండగా నిలవడంతో చిన్నారి హనీ భవిష్యత్తు పై ఆశలు చిగురుస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాప తల్లిదండ్రులకు 13 ఇంజక్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు ,మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సిహెచ్ భరత్ లక్ష్మి స్థానిక ప్రజా ప్రతినిధులు చెల్లుబో యిన శ్రీనివాస్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

