Andhra PradeshHome Page Slider

ప్రధాని మోదీతో కీలక అంశాల పై జగన్ చర్చలు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. విభజన హామీలను తక్షణమే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు. పోలవరం తొలిదశ నిర్మాణానికి, కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే రూ.12911.15 కోట్ల మంజూరు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, అయితే తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని, ఇది ఇస్తేనే తొలిదశ పూర్తైనట్టని సీఎం ప్రధానికి వివరించారు. మొత్తంగా పోలవరం తొలిదశ నిర్మాణానికి రూ.17144 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఖర్చు చేసిన రూ.1310.15 కోట్లను వెంటనే రీయింబర్స్‌ చేయాల్సిందిగా విజ్ఙప్తి చేశారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిలు కూడా పెండింగులో ఉన్నాయని సీఎం తెలిపారు. ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల చెల్లింపులు సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయని, ఏపీ జెన్‌కో ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా ఈ బకాయిలు వచ్చేలా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ప్రధానమంత్రిని కోరారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించిన విషయాన్ని సీఎం మరోసారి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతాచట్టం కింద కనీసంగా 10 శాతం అధికంగా కవరేజీ ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్‌ దక్కకుండా పోతోందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోందని, సత్వరమే జోక్యంచేసుకోవాలని ప్రదానమంత్రిని కోరారు. ప్రతినెలా వినియోగించకుండా దాదాపు లక్ష టన్నుల బియ్యం కేంద్రం వద్ద ఉంటోందని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి ఇస్తే సరిపోతుందని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ప్రధానిని కోరారు.


రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు పెండింగులో ఉన్నాయినే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేక హోదా సహా, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా దోహదపడుతుందని, రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ఈమేరకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని సీఎం విజ్ఞప్తి చేశారు. 26 జిల్లాలుగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో, ప్రతి జిల్లాకు కనీసంగా 18 లక్షల జనాభా ఉందని ప్రధానికి సీఎం తెలిపారు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 11 కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలను చేపట్టామని వెల్లడించారు. ఈ కాలేజీలకు తగిన ఆర్ధిక సహాయం చేయాలని సీఎం కోరారు.