News

మహిళాఉద్యోగులపై లైంగికవేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ

•మహిళల భద్రత, సాధికారత సాధనలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
•అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో ఈ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలి
•రాష్ట్ర మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ వెల్లడి

మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల నివారణకు ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ప్రధాన భూమిక పోషిస్తాయని రాష్ట్ర మహిళల, బాలల, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖా మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. భారత ఉన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన పలు ఉత్తర్వుల ప్రకారం అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లోను, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. గురువారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆద్వర్యంలో “పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2013” అమలు తీరు పై జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు, సంక్షేమానికి, సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పలు వినూత్న పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. మహిళా సాధికారతకు బడ్జెట్ లో కూడా భారీ మొత్తంలో నిధులను మహిళల సంక్షేమం, అభివృద్దికే కేటాయించామన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఆరోగ్య పరంగా అభివృద్ది పథంలో ముందుకు వెళుతున్నారన్నారు.

ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంద్రప్రదేశ్ లో మహిళల ఫిర్యాదులు చాలా తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయని, ఇందుకు జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్న పలు రకాల చర్యలే కారణమని ఆమె పేర్కొన్నారు. అయితే పని చేసే ప్రదేశంలో మహిళా ఉద్యోగినులపై ఎటు వంటి లైంగిక వేధింపులకు ఆస్కారం లేకుండా ఉండేందుకై, మహిళలు వారి సమస్యలను నిర్బయంగా వెల్లడి చేసుకునేందుకు ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ప్రధాన వేదికలుగా పనిచేస్తాయన్నారు. ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను ఇంత వరకు ఏర్పాటు చేయని శాఖాధిపతులు వెంటనే తమ కార్యాలయాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ పనిచేసే మహిళా ఉద్యోగినుల్లో ఈ కమిటీలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్, శిశువులకు పాలిచ్చే ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళల భద్రత, సాధికారత సాధనలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి చూపుతున్న ప్రత్యేక శ్రద్దే ఇందుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారానికి, మహిళల భద్రతకు, రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు గత ఏడాది మార్చి 8 న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి “సబల” కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ గత ఏడాది నుండి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున అమలు చేస్తూ గుంటూరు, ఏలూరు, కర్నూలు మరియు విశాఖపట్నం జోన్లలో పలు అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సదస్సుల్లో గుర్తించిన మహిళల సమస్యలను పెద్ద ఎత్తున పరిష్కరించామన్నారు. కుటుంబ సలహాలు ఇచ్చేందుకు ప్రతి నెలా ప్రత్యేక డ్రైవ్ లను కూడా మహిళా కమిషన్ నిర్వహిస్తున్నదని తెలిపారు. అయితే ఉద్యోగినులు వారు పనిచేసే ప్రదేశంలో భద్రత కల్పించేందుకు ఇప్పటికే పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, ఇంకా కమిటీలు ఏర్పాటు చేయని కార్యాలయాల్లోని ఉద్యోగినులు వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మహిళా కమిషన్ దాకా రావాల్సి వస్తున్నదన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ దాకా మహిళా ఉద్యోగినులు వచ్చే పరిస్థితి లేకుండా అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని పద్మ కోరారు.