శ్లాబ్ కూలి కార్మికులకు గాయాలు
హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న పరిపాలన భవనం పోర్టికో స్లాబ్ కుప్పకూలింది. దాని మీద నిల్చొని పని చేస్తున్న 9 మంది కార్మికులు శిథిలాల్లో చిక్కుకుని గాయాల పాలయ్యారు. హెచ్సీయూ క్యాంపస్లో కొత్త పరిపాలన భవనం నిర్మిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీబీడబ్ల్యూడీ పర్యవేక్షణలో ఓ ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ ఈ పనులు చేపడుతోంది. గురువారం రాత్రి 8 గంటల సమయంలో పోర్టికో నిర్మాణంలో భాగంగా రెడీమిక్స్ కాంక్రీట్తో స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది.ఈ సమయంలో దానిపై నిల్చొని ఉన్న 9 మంది కార్మికులు కిందపడి శిథిలాల్లో చిక్కుకున్నారు. విద్యార్థులతో పాటు పోలీసులు, అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 9 మంది కార్మికులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. హెచ్సీయూలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్లు కూలడం ఇది మూడోసారి కావడంతో నాసిరకం పనులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
