Home Page Sliderhome page sliderNationalSports

ఆస్ట్రేలియా పై భారత్‌ ఘనవిజయం

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. శుక్రవారం జరిగిన ఈ మూడో వన్డేలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌట్‌ అయింది. కేవలం రెన్‌షా (56) మాత్రమే అర్ధశతకం సాధించగా, మిగతా బ్యాటర్లు మిచెల్‌ మార్ష్‌ (41), ట్రావిస్‌ హెడ్‌ (29), మాథ్యూ షార్ట్‌ (30), అలెక్స్‌ క్యారీ (24) పరిమిత ప్రదర్శన కనబర్చారు. భారత బౌలర్‌లలో హర్షిత్‌ రాణా అద్భుతంగా రాణించి 8.4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. వాషింగ్టన్‌ సుందర్‌ రెండు వికెట్లు పడగొట్టగా, సిరాజ్‌, ప్రసిద్ధ్‌, కుల్దీప్‌, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.
237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అజేయ శతకంతో ఆసీస్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 125 బంతుల్లో 13 బౌండరీలు, 3 సిక్సర్లతో అజేయంగా 121 పరుగులు చేశాడు. మరోవైపు విరాట్‌ కోహ్లీ (74; 7×4) అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెనర్‌ శుభ్‌మాన్‌ గిల్‌ (24) ప్రారంభంలో దూకుడుగా ఆడి హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.
ఫలితంగా భారత్‌ 38.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. రోహిత్‌, కోహ్లీల అద్భుత భాగస్వామ్యం ఆసీస్‌ బౌలర్లను చిత్తు చేసింది. అయితే సిరీస్‌లో తొలి రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియానే 2-1 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది.