‘మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్..మూడవసారి కూడా మా ప్రభుత్వమే’- మోదీ
తమ ప్రభుత్వం మూడవసారి కూడా అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని ప్రధానిమోదీ ధీమా వ్యక్తం చేశారు. దీనితో భారత్ అతిపెద్ద మూడవ ఆర్థికవ్యవస్థగా మారనుందని పేర్కొన్నారు. ఆదివారం గుజరాత్లోని సూరత్లో ఖజోడ్ అనే గ్రామంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన అత్యాధునిక వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. సూరత్ డైమండ్ బోర్స్(ఎస్డీబీ )గా దీనికి నామకరణం చేశారు. ఇది నవీన భారత శక్తికి తార్కాణంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని అతిపెద్ద భవంతులు కూడా ఈ వజ్రపు తళుకుల ముందు వెలవెలపోతాయన్నారు.

గత పదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ పదోస్థానం నుండి మూడవస్థానానికి చేరిందన్నారు. త్వరలో రాబోతున్న ముంబయ్-డిల్లీ ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టు సూరత్లో వాణిజ్యానికి సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. 35 ఎకరాల స్థలంలో సుమారు రూ.3,400 కోట్లతో నిర్మించిన ఈ సిటీలో తొమ్మిది భవనాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 15 అంతస్తులు ఉన్నాయి. దీనితో ఇప్పటి వరకూ అమెరికాలోని పెంటగాన్ అతిపెద్ద కార్యాలయసముదాయంగా ఉండగా, ఇప్పుడు ఆస్థానాన్ని ఎస్డీబీ సంపాదించింది. దీనితో సుమారు 65వేల మంది వ్యాపారాలు చేసుకునే వీలుంది.

