Telangana

తొందరపడి ఒక కోయిల ముందే కూసింది

‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది’ అంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బీజేపీ నేతను టార్గెట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. పలు జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలను రేవంత్‌ తన ట్వీట్‌కు షేర్‌ చేశారు. వరంగల్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని.. వాళ్లంతా మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తమ పార్టీలో చేరతారని ఎమ్మెల్యే రఘునందన్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ లంకె బిందెలిచ్చినా.. అరుంధతి బంగ్లాలో బంధించినా ఆ ఎమ్మెల్యేలు శృంఖలాలు తెంచుకొని మరీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని రఘునందన్‌ చెప్పిన విషయాన్ని రేవంత్‌ రెడ్డి తన ట్వీట్‌లో ప్రస్తావించారు.