గ్యాస్ ట్రబుల్ తో వస్తే దురదకు మందిచ్చారు
రోగమొకటైతే మందు మరొకటేస్తారా అన్న సామెతను నిజం చేశారు అక్కడున్న వైద్య సిబ్బంది.సామెతను సామెతలా ఉంచితే ఎలా..దాన్ని నిజం చేస్తే పోలా అనుకున్నారో ఏమో..గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ ఆసుపత్రికి చేరిన వృద్ధురాలికి వేరే మెడిసిన్ ఇచ్చి పరోక్షంగా ప్రాణాలు తీయబోయారు.మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎలకుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది.గుండెల్లో భారంగా ఉందంటూ ఓ వృద్ధురాలు స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందే మందిచ్చారు.అయితే దురదకు సంబంధించిన టానిక్ అది.దాన్ని తాగిన వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యింది.దీంతో బాధితురాలిని కుటుంబీకులు అదే వైద్య కేంద్రానికి తీసుకెళ్లి ఇచ్చిన మందును చూపించగా అది దురదకని తెలుసుకుని అవాక్కయ్యారు.బాధితులు,ఇతర వైద్య సిబ్బంది…జరిగిన విషయాన్ని వైద్యులకు చెప్పడంతో బాధితురాలిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.