Home Page SliderTelangana

నా అవసరం లేదని చెబితే ఇప్పటికిప్పుడే రాజీనామా చేస్తా..

సొంత పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏమైందంటే.. తెలంగాణ బీజేపీలో పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం చిచ్చుపెట్టింది. ఎమ్మెల్యే, ఎంపీలు సూచించిన విధంగా అధ్యక్షుల ఎంపిక జరగకపోవడంతో కీలక నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాను సపోర్ట్ చేసిన నేతకు గోల్కొండ – గోషామహల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వక పోవడంతో రాజాసింగ్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని వెల్లడించారు. పార్టీకి తన అవసరం లేదని చెబితే ఇప్పటికిప్పుడే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పారు. పార్టీలో కొంతమంది చేస్తున్నట్లు తనకు బ్రోకరిజం చేయడం రాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ-గోషామహల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ నేతకు ఇవ్వాలని సూచిస్తే.. కనీసం తనను పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీ నేతలతో అంటకాగే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. దీనిపై పార్టీలో ఉన్న ఓ ముఖ్య నేతను ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. గోల్కొండ-గోషామహల్ జిల్లా అధ్యక్ష పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.