పోలీస్ స్టేషన్ నాకు అత్తారిల్లే
పోలీస్ స్టేషన్ తనకు అత్తారిల్లుగా మారిపోయిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని తనపై 15 కేసులు పెట్టారని, ఏడుసార్లు జైలుకు తీసుకెళ్లారని లోకేశ్ మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలన్నదే తమ లక్ష్యమని, వైసీపీ బెదిరింపులకు, కేసులకు భయపడేది లేదని పేర్కొన్నారు. జగన్ తాత రాజారెడ్డికే తమ పార్టీ భయపడేది కాదని, ఈయనకు భయపడతామా అని చమత్కరించారు.
రాష్ట్రప్రభుత్వం పేదలకు అన్నం పెట్టడం లేదని, పైగా అన్నా క్యాంటీన్లను అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. మంగళగిరి, కుప్పం, తెనాలిలో అన్నా క్యాంటిన్లను ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని చినరావూరులో ఇటీవల మృతి చెందిన తమ పార్టీ నేత పాటిబండ్ల నరేంద్రనాథ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల నుండి నరేంద్రనాథ్ తనకు పరిచయమయ్యారన్నారు. ఈ పర్యటనలో పార్టీ సీనియర్ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు తదితరులు లోకేశ్ వెంట ఉన్నారు.

