బుల్లెట్ తూటాలు ఎదుర్కోవడానికైనా సిద్ధమే…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మంగళహాట్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ నెల 6న ట్విట్టర్లో అయోధ్యపై ఆయన పోస్ట్ చేశారు. దీంతో, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, వివరణ ఇవ్వాలని ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే.. హైకోర్టు షరతులను ఉల్లంఘించారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు రాజాసింగ్ తరుఫు న్యాయవాది పోలీసులకు వివరణ కూడా ఇచ్చారు. అయితే.. ఈ వివరణతో సంతృప్తి చెందలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో రాజాసింగ్పై ఐపీసీ సెక్షన్ 295-ఏ కింద మరోసారి పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు తనపై పోలీసులు మరో కేసే నమోదు చేయడంపై రాజాసింగ్ స్పందించారు. బాబ్రీమసీదుపై ఒవైసీ బ్రదర్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని… వాళ్లపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు తనపై కక్ష కట్టి వరసగా కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సిద్ధాంతం కోసం బుల్లెట్ తూటాలను ఎదుర్కోవడానికి కూడా తాను సిద్ధమేనని అన్నారు.

