జగన్ గారూ చూడండి.. అవినీతి కట్టడి ఎలా?
◆ తిరుగుబావుట ఎగుర వేస్తున్న తహశీల్దార్లు
◆ ఇప్పటి వరకు భరించాం..ఇక మేం భరించలేం
◆ తప్పనిసరి పరిస్థితుల్లో అవినీతి చేస్తున్న అధికారులు
◆ జగన్ న్యాయం చేయాలంటూ ఆవేదన
ఎవరైనా మంత్రి జిల్లాలో పర్యటనకు వస్తే ఎంతో హంగామా.. ఎన్నో ఏర్పాట్లు ఉండాల్సిందే. వాహనాలు,వచ్చిన వారికి భోజనాలు,కార్యక్రమం కోసం టెంట్లు,కుర్చీలు ఇలా ఎన్నో ఖర్చులు. ఒక్కో పర్యటనకు దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. వీటన్నింటికీ సొమ్మును స్థానిక రెవెన్యూ అధికారులే భరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు భరించాం… ఇక మేం భరించలేం..అంటూ వారు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ప్రొటోకాల్ ఖర్చుల కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం మొత్తానికి కేటాయించింది రూ.17 కోట్లు. వీటిని 26 జిల్లాల్లోని 679 మండలాలకు పంచితే ఎంత వస్తాయి? ముఖ్యమంత్రి,మంత్రులు, ఇతర సీనియర్ అధికారులు తరచూ ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూనే ఉంటారు. ఆ ఖర్చులకు ఈ సొమ్ము ఏ మాత్రం సరిపోవని తహసీల్దార్లు పేర్కొంటున్నారు.

ఒకవేళ బిల్లులు పెట్టుకున్నా అవి ఎప్పటికి వస్తాయో..ఎంత వస్తాయో కూడా తెలీదని అంటున్నారు. దీంతో మంత్రి పర్యటన ఖర్చును రెవెన్యూ సిబ్బంది తలా కాస్తా పంచుకోవలసిందేనని చెబుతున్నారు. భోజనాల ఖర్చులు ఒకరివైతే టెంట్లు, కుర్చీలకు ఒకరు పెట్టుకుంటారని, వాహనాలను మరొకరు భరించాల్సి వస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాము ‘అవినీతి’ బాట పడుతున్నామని బహిరంగ వ్యాఖ్యలే చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతిని సహించమని తేల్చి చెబుతున్నారని.. కానీ ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నిర్వర్తించాలో చెప్పాలంటూ కోరుతున్నారు. అంతిమంగా ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్న వాదనను తెరపైకి తెస్తున్నారు.

రాష్ట్ర ఖజానాలో ఏర్పడిన సంక్షోభం కారణంగా మండల తహసీల్దార్ కార్యాలయాల అవసరాలకు నిర్దేశించిన నిధుల్లో కోత పడింది. స్టేషనరీ అవసరాల కోసం ప్రతి మండల కార్యాలయానికి నెలకు రూ. 245 మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తోంది. అంతేకాదు ఈ కార్యాలయాల అవసరాలకు కేటాయించిన రూ. 30 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది యూనిఫాం కొనుగోలుకు మళ్లించింది. ఆ నిధులను వెనక్కు పంపించాలని,నెలకు కేటాయించిన మొత్తాన్ని పెంచాలని రెవెన్యూ శాఖ పదేపదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేదు. ప్రొటోకాల్ అవసరాలు, వాహన వినియోగం,కోర్టు కేసులకు అయ్యే ఫీజులను ప్రభుత్వం చెల్లించక పోవడంతో తహశీల్దార్, ఇతర సిబ్బందే భరించాల్సి వస్తోంది.

ఆదాయ,కుల,కుటుంబ, ఇతర ధ్రువీకరణపత్రాలు పొందేందుకు గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుదారులు చెల్లించే మొత్తంలో కొంత తహశీల్దార్ కార్యాలయాల అవసరాల కోసం జిల్లా కలెక్టర్ కేటాయిస్తారు. ఉదాహరణకు ఒక సర్టిఫికేట్ మంజూరుకు దరఖాస్తుదారు నుంచి రూ.35 వసూలు చేస్తే అందులో ఏడు రూపాయలు రెవెన్యూ శాఖకు రావాలి. ఇందులో కనీసం 2 నుంచి 5 రూపాయల వరకు తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లాలి. ఇలా జమ అయిన మొత్తంలో రూ. 30 కోట్లను గత ఫిబ్రవరిలో యూనిఫాం కొనుగోలుకు వినియోగించారు. ఈ మొత్తాన్ని వెనక్కు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు తిరిగి చేరలేదు. ఈ నేపథ్యంలో ఇకపై తాము ఖర్చులు భరించేది లేదని వారు తెగేసి చెబుతున్నారు. మరి దీనిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

