Breaking Newshome page sliderHome Page SliderNationalviral

సిక్కింలో భారీ వర్షాలు…నలుగురు మృతి

భారీ వర్షాల కారణంగా హిమాలయ సానువులలో నివసించే ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఉప్పెనలా ముంచుకొస్తున్నాయి. శుక్రవారం సిక్కింలోని భారీ వర్షాల కారణంగా పర్వతాలు పగుళ్లు వస్తున్నాయి. పశ్చిమ సిక్కింలోని యాంగ్‌ తాంగ్ నియోజకవర్గంలోని ఎగువ రింబిలో కొండచరియలు విరిగిపడటంతో, శిథిలాలు, రాళ్ళు హ్యూమ్ నదిలోకి పడ్డాయి. ఈ కారణంతో నదిలోని నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారని సమాచారం. కొండ ప్రాంతాల సమీపంలోని రాష్ట్రాలలో మేఘ విస్పోటనం, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. స్థానిక గ్రామస్తులు, SSB జవాన్లతో కలిసి పోలీసులు వరద నీటితో ఉప్పొంగుతున్న హ్యూమ్ నదిపై చెట్ల దుంగలతో తాత్కాలిక వంతెనను నిర్మించి, ప్రభావిత ప్రాంతం నుంచి ప్రజలను తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలను రక్షించారు. ఇక్కడ, హ్యూమ్ నదితో పాటు, ఇతర నదులు కూడా భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పర్వతాలలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వరకు, పర్వత ప్రాంతాలలో ఇప్పటివరకు ఇటువంటి అనేక సంఘటనలు నమోదయ్యాయి, వీటిలో వందలాది మంది మరణించారు. సెప్టెంబర్ 17 వరకు సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.