Andhra PradeshHome Page SliderTelangana

ఆంధ్రా, తెలంగాణాలో భారీ వర్షాలు, 27 మంది మృతి, రంగంలోకి మోదీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరదలు, నీటి ఎద్దడి ఏర్పడి రోడ్డు, రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడమే కాక, కనీసం 27 మంది మరణించారు. ఆదివారం రెండు రాష్ట్రాల్లోనూ నదులు ఉధృతంగా ప్రవహించడంతో తెలంగాణలో 15 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 12 మంది చనిపోయారు. వరద బాధితుల్ని సహాయక శిబిరాలకు తరలించారు. ఇప్పటివరకు 100 కంటే ఎక్కువ రైళ్లు రద్దు చేశారు. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సేవలు అందించే దక్షిణ మధ్య రైల్వే ట్రాక్స్, వరదలకు భారీగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో ట్రాక్‌పై నీటి ప్రవాహం కారణంగా అనేక ఇతర రైళ్లు దారి మళ్లించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలతో మాట్లాడి కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో సోమవారం అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి, వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పని ఉంటే మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ జిల్లా ఎక్కువగా ప్రభావితమైంది. విజయవాడ శివార్లలోని బుడమేరు వాగు ఆదివారం పలుచోట్ల పొంగి ప్రవహించడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. వరద ప్రభావిత విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండోసారి పర్యటించి, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, నంద్యాల జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.