అసభ్యంగా నన్ను తాకుతున్నాడు.. బడికెళ్లను..
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడ లో చోటుచేసుకుంది. ‘సార్ నన్ను అసభ్యంగా తాకుతున్నాడు.. బడికి వెళ్లను’ అని ఆ చిన్నారి మారాం చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. గురువు వికృత చేష్టలకు ఆ చిన్నారి కొంతకాలంగా వేదనకు గురవుతోంది. బడికి వెళ్లాలంటేనే భయంతో మొండికేస్తోంది. తల్లిదండ్రులు బతిమాలి, బెదిరించి పంపిస్తున్నారు. ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలను ఇంట్లో చెప్పలేక ఇంట్లోనే ఓ మూల కూర్చొని ఏడుస్తోంది. దిగాలుగా ఉన్న చిన్నారిని ఎందుకు బడికి వెళ్లనంటున్నావని తల్లి ప్రశ్నించింది. ఆ చిన్నారి బోరుమని ఏడుస్తూ తల్లికి అసలు విషయం చెప్పింది. గుడివాడ మండలం చౌటపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎం. చంద్రశేఖర్ (42) కొంతకాలంగా నాలుగో తరగతి విద్యార్థినిని అసభ్యంగా తాకుతున్నాడని.. దీంతో బడికి వెళ్లాలంటే భయపడుతోందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.