‘ఢిల్లీ కంటే రాజ్భవన్ దగ్గరే’ అంటూ తెలంగాణా సీఎస్పై గవర్నర్ ఫైర్
తెలంగాణా గవర్నర్ , గవర్నమెంట్ మధ్య మనస్పర్థలు తొలగిపోలేదు. గత కొన్ని నెలలుగా అనేక అంశాలపై ఈ ఇరువురి మధ్య ఏకాభిప్రాయం ఉండడం లేదు. తెలంగాణా ప్రభుత్వం పంపిన బిల్లులను నెలల తరబడి గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలంగాణా సర్కార్ కోపంగా ఉంది. అసెంబ్లీలో ఆమోదించిన దాదాపు 10 ముఖ్య బిల్లులను గవర్నర్కు పంపామని, ఆరు నెలలుగా కేవలం GSTకి సంబంధించిన బిల్లునే ఆమోదించారని, మిగతావి పెండింగ్లో ఉన్నాయని సుప్రీం కోర్టుకు చేరింది తెలంగాణా సర్కార్. తెలంగాణా ప్రభుత్వం తరపున సీఎస్ శాంతకుమారి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గవర్నర్ తనదైన శైలిలో బదులిచ్చారు. తెలంగాణా సీఎస్పై మండిపడ్డారు.
సుప్రీంకు చేరేముందు తనను కలిసి ఉంటే బాగుండేదన్నారు. రాజభవన్ చాలా దగ్గరగా ఉందని, ఢిల్లీలోని సుప్రీం కోర్టుకు వెళ్లే కంటే రాజ్భవన్కు వచ్చి, సమస్యలు తెలియజేస్తే మంచిదన్నారు. సీఎస్గా శాంతకుమారి బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీసం ఒక్కసారి కూడా రాజ్భవన్కు రాలేదని, మర్యాదకు ఫోన్లో కూడా మాట్లాడలేదని ట్వీట్ చేశారు తమిళిసై. ఏదైనా బిల్లుల విషయం వ్యక్తిగతంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు కోర్టును సంప్రదించారన్నారు.