బీజేపీ పార్టీకి కన్నా గుడ్బై
కమలం పార్టీకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కన్నా రాజీనామా లేఖను పంపారు. ఆయన అనుచరులు కూడా కన్నా బాటలోనే పయనించారు. గత కొంతకాలంగా కన్నా పార్టీకి దూరంగా ఉంటున్నారు. కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. సోమవారం అమరావతిలో జరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో కూడా కన్నా పాల్గొనలేదు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడినై బీజేపీలో చేరానని కన్నా తెలిపారు. పార్టీలో చేరినప్పటినుంచి సామాన్య కార్యకర్తగా పనిచేశానని.. దాన్ని గుర్తించే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రవర్తన బాగాలేకనే బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే.. మోదీపై ఉన్న అభిమానం ఎప్పటికీ చెక్కుచెదరని అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కన్నా టీడీపీలో కానీ జనసేన పార్టీలోకి కానీ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.