‘తక్షణమే రంగంలోకి దిగండి’..రేవంత్ రెడ్డి
తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు ఏక సభ్య కమిషన్ నియామకం వెంటనే చేపట్టడంతో పాటు 60 రోజుల్లోనే కమిషన్ నివేదిక సమర్పించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించిన అనంతరం దానికి అనుగుణంగా రాష్ట్రంలో నూతన నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 60 రోజుల్లోనే సామాజిక, ఆర్థిక సర్వే పూర్తి చేయాలని డిసెంబరు 9లోపే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సర్వే పూర్తయితే వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లొచ్చని సీఎం అన్నారు. దీనికోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.


