Telangana

బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీ లో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బూర నర్సయ్య గౌడ్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, భూపేంద్రయాదవ్‌, బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ కె.లక్ష్మణ్‌ తదితరుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. బూర నర్సయ్యతోపాటు మరికొందరు నేతలు బీజేపీలో చేరారు. వారికి నేతలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బూర నర్సయ్య గౌడ్‌ మాట్లాడుతూ.. ”నిష్పక్షపాతంగా ప్రజల శ్రేయస్సు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడమే నా ప్రధాన కర్తవ్యం అన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులను తెలంగాణకు, ప్రత్యేకంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకొచ్చానన్నారు. సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌.. అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తాను. తెలంగాణ, దేశ అభివృద్ధి కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను” అని ఆయన అన్నారు.