జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మోసానికి ముగింపు పలకండి: కేటీఆర్ పిలుపు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించే ముందు బీఆర్ఎస్ దశాబ్దపాలనలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ రెండేళ్ల వైఫల్యాలను పోల్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్లోని షేక్పేట్ డివిజన్లో రిలయన్స్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ప్రతి వర్గాన్ని మోసం చేసిందని, పేదల ఇళ్లపై బుల్డోజర్ వేసి ప్రజలను భయపెడుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని విమర్శించే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న అదే పాలన కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని బీజేపీ రాష్ట్రాల కంటే ముందుగానే అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రం అగ్రశ్రేణి నగరంగా ఎదిగిందని, నిరంతర విద్యుత్ సరఫరా, పింఛన్లు, బస్తీ దవాఖానాలు, మైనార్టీలకు 204 గురుకుల పాఠశాలలు, విదేశీ విద్య కోసం రూ.20 లక్షల స్కాలర్షిప్ల వంటి సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయి బలమైన ప్రాంతీయ పార్టీలను బీ టీమ్లుగా చూపిస్తున్నారు. చదువుకున్న యువత, రైతులు, మహిళలు, ఉద్యోగులు — అందరూ బయటకు వచ్చి కాంగ్రెస్ మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. తెలంగాణ భవిష్యత్తు ఈ ఓటు మీదే ఆధారపడి ఉంది,” అని తెలిపారు.
జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, ప్రజల నిజమైన అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తేవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

