News

రూ.2.79 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్

రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు

సుస్థిరత.. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 – 24 సంవత్సరానికి గాను రూ. 2,79,279 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడో రోజైన గురువారం నాడు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో పేదలకు ఆర్థిక తోడ్డాటును అందించే నవరత్నాలకు పెద్ద పీట వేస్తూనే అభివృద్ధికి కీలక కేటాయింపులు చేశారు. ప్రస్తుత బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు ఉండగా, మూలధన వ్యయం రూ.31,061 కోట్లుగా చూపించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రధానంగా ఉన్న డీబీటీ స్కీంల కోసం పద్దులో రూ.54,228.36 కోట్ల కేటాయింపులు చేశారు. అంతకు ముందు బడ్జెట్ ప్రతిని అసెంబ్లీలోని శ్రీవారి చిత్రపటం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్లో ప్రధానంగా విద్యా రంగానికి రూ. 29,690 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధికి రూ. 15,873 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యానికి రూ. 2,602 కోట్లు, గహనిర్మాణ శాఖకు రూ. 5,600 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 3,951 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం నవరత్నాల కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాల డీబీటీ కోసం రూ.54,228.36 కోట్లను కేటాయించినట్లు మంత్రి బుగ్గన శాసన సభలో పేర్కొన్నారు.

బడ్జెట్లో విద్యారంగానికి రూ. 29 వేల కోట్లు

2023-24 బడ్జెట్లో పాఠశాల విద్య కోసం అత్యధికంగా రూ. 29,690 కోట్లు కేటాయింపులు చేశారు. జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,500 కోట్లు కేటాయించింది. మన బడి నాడు-నేడు పథకం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్‌, ఫర్నీచర్‌, గ్రీన్‌ బోర్డులు, ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు, వంట శాలతో సహా 10 మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. దీని కోసం బడ్జెట్లో రూ. 3,500 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యా కానుక కోసం బడ్జెట్‌లో జగనన్న రూ.560 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయింపులు చేపట్టారు.

సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా బడ్జెట్

బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు వివరించారు. సుపరిపాలనలో భాగంగా 16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో గతేడాది 18.39 కోట్ల పనిదినాలు కల్పించినట్లు మంత్రి శాసన సభకు వివరించారు. వైఎస్సార్‌ జలకళ కింద 17,047 బోరు బావులు తవ్వించినట్లు పేర్కొన్నారు. కొత్త కుళాయి కనెక్షన్ల ద్వారా 65 లక్షల ఇళ్లకు తాగు నీటి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. మౌలిక వసతులు, సేవలు మెరుగుపరిచి మంగళగిరి, తాడేపల్లిని మోడల్‌ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో పాటు పరిపాలనా రాజధాని విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నట్లు వివరించారు. వ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో 192 నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 క్రీడా కేంద్రాల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. విజయవాడ స్వరాజ్‌ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్‌ కాంస్య విగ్రహ ఏర్పాటు చేసి స్మృతివనం నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు.


రాష్ట్రమంతటా మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 4.25 కోట్ల మందికి నేరుగా ఇంటి వద్దకే రేషన్ అందిస్తున్నామని దీనికి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సభలో వివరించారు. దీని కింద సరుకుల పంపిణీ 84 శాతం నుంచి 94 శాతానికి పెరుగినట్లు వివరించారు. రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వీటిని ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నట్లు సభలో పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్లో 378 ఒప్పందాల ద్వారా రాష్ర్టానికి 13.42 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ పెట్టుబడుల ఆన్ గ్రౌండింగ్ ద్వారా 6 లక్షలకు పైగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

రూ. 41, 436 కోట్లతో వ్యవసాయ బడ్జెట్

రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పూర్తి స్థాయి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టిన తరువాత వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శాసనసభలో రూ.41,436 కోట్ల పద్దుతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 62 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారని, రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం మాదని వ్యవసాయ శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారు. పాల ఉత్పత్తిలో రాష్ట్రం ఐదో స్థానంలో ఉన్నట్లు మంత్రి సభకు వివరించారు. రైతులు విత్తనాలు నాటిన నుంచి కల్లం వద్దే ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్మే వరకు ప్రభుత్వం రైతన్నను వేలు పట్టుకు నడిపించడం కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నట్లు మంత్రి సభలో పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సేవలన్నీ ఆయా గ్రామాల్లో పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్భీకేల వద్ద బ్యాంకింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నామని, రైతుల ఆదాయం పెంచే విధంగా ఆర్భీకే సేవలు అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 8,837 ఆర్బీకే భవనాలు వివిధ స్థాయిల్లో నిర్మాణామవుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్మీకేలను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నాం. యూట్యూబ్‌ ఛానళ్లు, మాస పత్రికను ప్రారంభించిటనట్లు మంత్రి సభలో వివరించారు.